అందరికీ వందనములు.
మా తండ్రి కీ.శే. శ్రీ గారపాటి వీర్రాజు గారి నుండి నేను కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నానని ఘంటాపథంగా చెప్పగలను. అందులో కొన్ని నేనిప్పుడు ఉదహరించదలిచాను.
ఉన్నదానితో సంతృప్తి చెందడం, నాన్న గారి ఉత్తమ గుణం. 'బ్రతకలేక బడిపంతులు' అనుకునే రోజుల్లో, తనకు వచ్చే కాసింత జీతంతో, నల్గురు సంతానాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దారాయన. అందుకోసం తన వ్యక్తిగత అవసరాలనెన్నో త్యాగం చేసారు. మాకు ఏ లోటూ రానివ్వలేదు. మా బ్రతుకు తెరువుకు తగ్గ చదువునిచ్చారు. మా జీవనానికి అవసరమైన సంస్కారాన్నిచ్చారు. ఆయన ఒక ఆదర్శ జనకుడు.
తన చుట్టూ ఉన్నవారికి ఏ అవసరం వచ్చినా, ఆదుకొనే వ్యక్తిత్వం మా నాన్నగారిది. 'మనిషి సంతోషంగా ఉన్నప్పుడు, ఆ సంతోషంలో భాగస్వామ్యులు కావడానికి చాలా మంది ముందుకు వస్తారు. అదే మనిషి ఆపదలో ఉన్నప్పుడు, ఆదుకొనే వారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మనమూ ఉండాలి ' అని ఎప్పుడూ చెబుతుండేవారు, తాను ఆచరించి చూపేవారు. అందరికీ తలలో నాలుకలా మసలేవారు. అందుకే, ఆయన మమ్మల్ని వీడి పదునైదు సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ సంఘంలో మా గుర్తింపు 'వీర్రాజు మాష్టారి సంతానం' గానే. ఆయనొక అత్యున్నత సంఘజీవి.
కుటుంబ వ్యవహారాలలోనూ, సామాజిక కార్యక్రమాలలోనూ ఎంత మునిగిపోయినా, తన వృత్తిని ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు నాన్నగారు. తన విద్యార్థులకు మంచి విద్యను అందించి, ఉత్తమ పౌరులుగా సమాజానికి అందించడానికి తన వంతు కృషి చేస్తూనే ఉండేవారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో తాను పనిచేసిన అన్ని పాఠశాలల్లోనూ మంచి అధ్యాపకునిగా పేరు సంపాదించారు. అదనపు సంపాదన కోసం ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆయన ఒక ఉత్తమ ఉపాధ్యాయులు.
తెలిసిన కుర్రాళ్ళెవరైనా పనీ పాటూ లేకుండా, ఖాళీగా ఉండడం నచ్చేదు కాదు నాన్నగారికి. బంధుమిత్రుల కుటుంబాలలో, చదువు పూర్తయిన లేదా చదువు వంటబట్టని కుర్రాళ్ళు చాలా మందికి తనకున్న పరిమితుల్లో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నించేవారు. నేను ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత, నాకు కూడా అలా చాలా సార్లు చెప్పారు. నాకున్న పరిధుల్లో నేను కూడా ప్రయత్నించే వాడిని. అలా ఆయన చూపిన తొలి మెట్టుతో తమ జీవనాన్ని ఆరంభించి, ప్రగతి సోపానాలను అధిరోహించిన బంధుమిత్రుల పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక మంచి మార్గదర్శి.
ప్రతి వ్యక్తికీ విద్య ప్రాధమిక అవసరం అనీ, విద్య నేర్వని వ్యక్తి వ్యర్థమనీ దృఢంగా నమ్మేవారు నాన్నగారు. తన బంధువుల పిల్లలందరికీ ఓనమాలు దిద్దించి, దగ్గరుండి మరీ ప్రాధమిక పాఠశాలల్లో చేర్పించిన ఘనత ఆయనది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి చదువూ, అర్థాంతరంగా ఆగిపోరాదనేది ఆయన ఆశయం. అందుకే తనకు తోచిన సహాయం చేసి, అటువంటి వారిని ఆదుకొనే వారు. అమ్మాయిలకు చదువు ప్రాధమిక అవసరం అనేవారు. తన ఇద్దరు కూతుళ్ళను ఆ విధంగా చదివించి ఆదర్శంగా నిలిచారు. ఆయన ఒక గొప్ప ఆదర్శ వాది.
అటువంటి మహనీయుని పేరు మీద ఒక సేవాసంస్థను స్థాపించడం ద్వారా.. ఆర్థిక స్థితిగతుల కారణంగా తమ ఉన్నత విద్యకు ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉత్తమ విద్యార్థులకు సహాయం చేస్తూ, నాన్నగారి ఆశయసిద్ధికి నా ఉద్యోగానంతర విశ్రాంత జీవితాన్ని అంకితం చేయాలన్న నా ఆలోచనను సమర్ధించి సహకారం అందిస్తున్న నా ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా నాన్న గారి పేరిట మేము స్థాపించిన ఈ గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులు కొందరైనా వారి జీవితంలో స్థిరపడితే... మా జన్మ చరితార్థమైనట్లుగా మేము భావిస్తాం.